ప్రశాంతి నిలయం: ఎల్నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో అమలవుతున్న వీబీ జీ రామ్జీ పథకం అనుసంధానంతో ప్రతి మండలంలో ‘హాఫ్ మూన్ మోడల్’ ద్వారా వర్షపు నీటి ప్రవాహాన్ని అరికట్టి భూగర్భ జలాలను రీఛార్జ్ చేయాలన్నారు. గ్రామగ్రామానా కాంటూర్ కందకాలు, ఫారంపాండ్లు నిర్మించాలన్నారు. పంటల మొలక శాతాన్ని కాపాడేందుకు పీఎండీఎస్, పెల్లైటెజేషన్ విధానాలను అవలంభించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎకరాలోపు భూమి ఉన్న రైతులను గుర్తించి పశుగ్రాసం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘మన రైతు–మన బలం’ యూట్యూబ్ ఛానల్ను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
డ్రిప్ నమోదుకు వారోత్సవాలు..
ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకూ డ్రిప్, స్ప్రింక్లర్ నమోదు వారోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 386 రైతు సేవా కేంద్రాల ద్వారా కార్యక్రమం జరగుతుందన్నారు. అర్హులైన రైతులకు ఆధార్ సంఖ్య ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.


