ప్రశాంతి నిలయం: ఐక్య ఉద్యమాలతోనే హక్కుల సాధన సాధ్యమని, అందువల్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ఉద్యోగి ఉద్యమంలో కలిసి రావాలని ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా అధ్యక్షుడు ఎస్హెచ్ఎం మైనుద్దీన్ పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం సోమవారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల ఉద్యమాలు చేపట్టినా... సీఎం చంద్రబాబు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించక పోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించ తలపెట్టిన సన్నద్ధ సభను అనివార్య కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి నేతల ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్వరలో నిర్వహించబోయే సన్నద్ధ సభలో ప్రతి ఉద్యోగి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
21 డిమాండ్లతో కరపత్రాలు
కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు 21 డిమాండ్లతో కూడిన కరపత్రాలను ప్రదర్శించారు. మధ్యంతర భృతి, డీఏ బకాయిల విడుదల, 5 డీఏల మంజూరు, సీపీఎస్ను రద్దు.. ఓపీఎస్ అమలు, 11వ పీఆర్సీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, పెండింగ్ బకాయిల విడుదల, ఆర్టీసీ విద్యుత్ బస్సులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపడం, ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింప, రూ.10 వేల పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డు మంజూరు, కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ, గ్రామ సేవకులకు రూ.21,500 వేతనం తదితర డిమాండ్లను కరపత్రాల్లో పొందుపరిచారు.
సన్నద్ధ సభకు ప్రతి ఉద్యోగి
తరలిరావాలి
ఏపీజేఏసీ నాయకుల పిలుపు
కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన


