పుట్టపర్తి అర్బన్: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి పెద్ద ఎత్తున వారిని అడ్డుకొని అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మండిపడ్డారు. మంగళవారం పుట్టపర్తిలోని గణేష్ సర్కిల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించి అంగన్వాడీల అక్రమ అరెస్టును ఖండించారు. ఓబులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీతాలు పెంచుతామని, ప్రతి డిమాండును నెరవేర్చుతామని అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, లోకేష్ అధికారం రాగానే అంగన్వాడీలను పట్టించుకోలేదన్నారు. నెల రోజులుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. విజయవాడలో శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టి లాఠీచార్జ్ చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టడం చేతగాని తనమన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అంగన్వాడీలు తమ నిరసనను తెలిపారు. సమస్యలు పరిష్కరించేదాకా వెనక్కుతగ్గే ప్రశ్నేలేదని తేల్చి చెప్పారు.


