రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక
అనంతపురం సిటీ: నగర శివారులోని ఏజీఎస్ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక ప్రక్రియకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 12 మంది బాలికలు, 12 మంది బాలురు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ గట్టు నాగరాజు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన నందిని, సాయిశ్రీ, శ్రావణి, అమృత, గాయత్రి, సుస్మిత, మహాలక్ష్మీ, త్రివేణి, గాయత్రి, వైజయంతి, అలేఖ్య, తేజశ్రీ ఎంపికయ్యారని వివరించారు. బాలుర విభాగంలో డింపుల్ సాయినాథ్, జీవంత్, రేవంత్, రాంచరణ్, నవనీత్, రిషిధర్, చక్రి, హేమసాయి, వరుణ్ సందేశ్, సాయిచరణ్, వినోద్కుమార్, సుభాష్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రగ్బీ టోర్నమెంట్ సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో పీడీలు సుదర్శన్, మురళి, చంద్ర నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.
7న ‘దిశ’ సమావేశం
అనంతపురం టవర్క్లాక్: శ్రీ సత్యసాయి జిల్లా దిశ సమావేశం జనవరి 7న నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో తప్పకుండా హాజరు కావాలని సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపారు.
శాంతిభద్రతలకు
భంగం కలిగిస్తే ఉపేక్షించొద్దు
తాడిమర్రి: గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎవరైనా, ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని ఎస్పీ సతీష్ కుమార్ ఎస్ఐ కృష్ణవేణికి ఆదేశించారు. స్థానిక పోలీసుస్టేషన్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక శక్తులు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారికి, రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు.
ట్రాక్టర్ను స్వాధీనం
చేసుకున్న అధికారులు
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని రావులచెరువు పంచాయతీలో పారిశుధ్య పనులకు ఉపయోగించాల్సిన ట్రాక్టర్ను టీడీపీ నాయకుడు సొంత పనులకు వాడుకుంటున్న వైనంపై శనివారం ‘సాక్షి’ దిన పత్రికలో ‘తమ్ముడి అతి తెలివి’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి టీడీపీ నాయకునికి చీవాట్లు పెట్టి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్కు తొలగించిన ప్రభుత్వ స్టిక్కర్లను పంచాయతీ కార్యదర్శి యల్లప్ప ఆధ్వర్యంలో తిరిగి అతికించారు.
డీఐజీ షిమోషికి పదోన్నతి
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి పదోన్నతి దక్కింది. 2008 ఐపీఎస్ క్యాడర్కు చెందిన ఆమెకు ఐజీగా పదోన్నతిగా కల్పిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు రాలేదు. దీంతో మరికొంతకాలం డీఐజీగానే ఆమె కొనసాగనున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.
రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక
రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక
రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక


