
పవన్ కళ్యాణ్తో ఆకుల ఉమేష్ (ఫైల్)
చిలమత్తూరు: మద్యం సేవించడానికి కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన హిందూపురం జనసేన నాయకుడు ఆకుల ఉమేష్, అతని స్నేహితుల బృందం తప్పతాగి అమడగూరు మండలానికి చెందిన రమేష్బాబుపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 23న కంటి వైద్య పరీక్షల కోసం రమేష్బాబు అనే వ్యక్తి బెంగళూరుకు వెళ్తూ బాగేపల్లి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఓ ధాబా వద్ద భోజనానికి ఆగాడు. ఆ సమయంలో తాగి ఉన్న ఆకుల ఉమేష్, అతని మిత్ర బృందం రమేష్బాబుపై దాడిచేసి అతని ఒంటిపై 16 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు.
దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు జనసేన నాయకులపై 323, 363, 392, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బాగేపల్లి సీఐ రవికుమార్ తెలిపారు. కేసులో ఆకుల ఉమేష్ ఏ–1 నిందితుడు కాగా, లోకేష్ అనే వ్యక్తి ఏ–2, చిలమత్తూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు ప్రవీణ్ ఏ–3, భాస్కర్ ఏ–4గా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఉమేష్ హిందూపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతనిపై హిందూపురంలో కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.