అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పాలకమండలి సమావేశం సోమవారం వీసీ జ్యోతికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులు నేరుగా, ఎక్స్ అఫిషియో అధికారులు ఆన్లైన్లో హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలకు అమోదం తెలిపారు. ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం (సీఏఎస్) కింద పదోన్నతికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న మినిమం స్కేలు ఉద్యోగులకు నెలకు రూ.4 వేల జీతం పెంపుదలకు పాలకమండలి సమ్మతించింది. అకడమిక్ అసిస్టెంట్లు, టీచింగ్ అసిస్టెంట్లు, అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్హాక్ ప్రిన్సిపాళ్ల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయాన్ని పాలకమండలి తిరస్కరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలే పదవీ విరమణ అని స్పష్టం చేసింది. దూరవిద్య విభాగం నుంచి బీఈడీ కళాశాలకు బదలాయించిన అధ్యాపకులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి వారు దూరవిద్య విభాగంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పరీక్షల విభాగం ఉద్యోగులు నేరుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారనే కారణంతో గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి సదరు ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ కోత విధించారు. తాజాగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కోత విధించకుండా ఇవ్వాలని పాలకమండలి ఆమోదం తెలిపింది.


