చిలమత్తూరు: ఆమె ఆ గ్రామ మాజీ వార్డు మెంబర్. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కష్టపడి ఇంటర్ చదివిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన తల్లికి వందన (అమ్మఒడి) పథకానికి ఆమె అన్ని విధాలా అర్హురాలు. కానీ ఆమెకు ఆ నిధులు అందలేదు. ఎందుకని ఆరా తీసేందుకు సచివాలయానికి వెళితే...ఎవరూ పట్టించుకోలేదు. గంటల తరబడి వేచిచూసిన ఆమె అస్వస్థతకు గురై అక్కడే పడిపోయారు. వివరాల్లోకి వెళితే...చిలమత్తూరు 1వ వార్డు మాజీ సభ్యురాలు విజయలక్ష్మి భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆమె ‘తల్లికి వందనం’ పథకానికి పూర్తి అర్హురాలైనా నగదు ఖాతాలో జమ చేయలేదు. ఎన్నిసార్లు అధికారులను అడిగినా ‘నీ భర్త అకౌంట్లో నగదు పడింది’ అంటూ పో అంటూ పంపిస్తున్నారు. అయితే తన భర్త మృతి చెందగానే.. ఆయన ఖాతాను బ్యాంకు అధికారులు రద్దు చేశారని, అలాంటిది ఆ ఖాతాకు నగదు ఎలా జమ అవుతుందని ఆమె ప్రశ్నించినా...సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి గ్రామ సచివాలయానికి వచ్చిన విజయలక్ష్మి...గంటల తరబడి అక్కడే నిల్చోవాల్సి రావడంతో సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆమెకు నీరు తాగించి సపర్యలు చేసి ఇంటికి పంపారు. ఇలా విజయలక్ష్మి మాత్రమే కాదు...జిల్లాలో వేలాది మంది అర్హులైన మహిళలు తల్లికివందనం డబ్బులు జమకాక సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
‘తల్లికివందనం’ డబ్బులు పడకపోవడంతో
సచివాలయానికి వచ్చిన మహిళ
సమాధానం చెప్పేవారు లేక
గంటల తరబడి వేచి చూసిన వైనం
చివరకు సొమ్మసిల్లి పడిపోయిన
మాజీ వార్డు మెంబర్


