● నగరంలో జూనియర్ డాక్టర్ల బైక్ ర్యాలీ
నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు సర్కారు దిగి వచ్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనీష్కుమార్ తెలిపారు. తమకు స్టయిపండ్ పెంచాలని, డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సు 62కు మించరాదని, ఎంబీబీఎస్, పీజీ చేసిన డాక్టర్లతోనే బోధించాలనే డిమాండ్లతో నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవలు బంద్ చేసి జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి ఎమర్జెన్సీ వైద్యసేవలు ఆపేసి సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా మంగళవారం జూనియర్ డాక్టర్లు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్గామిట్టలోని ప్రభుత్వాస్పత్రి నుంచి వీఆర్సీ గ్రౌండ్ వరకు జరిగింది. ర్యాలీలో డాక్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. డాక్టర్ హనీష్కుమార్ మాట్లాడుతూ తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. రేయింబవళ్లు కష్టపడుతున్నామన్నారు. రోగులకు సేవలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం స్టయిపండ్ పెంచమని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తమ డిమాండ్లపై చర్చించి న్యాయం చేయాలన్నారు. లేదంటే సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.
రోగులపై సమ్మె ప్రభావం
జూనియర్ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే కొనసాగితే రోగుల ఆరోగ్యానికి రక్షణ ఉండదంటున్నారు. ఇదిలా ఉండగా డ్యూటీలకు హాజరు కావాలంటూ డీఎంఈ అధికారులు పీజీలకు, ఎస్ఆర్ (సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు)లకు నోటీసులు జారీ చేశారు. దీంతో జూనియర్ డాక్టర్లు వారిని విధులకు హాజరు కావొద్దని, ఐక్యంగా పోరాడితేనే న్యాయం జరుగుతుందని వి న్నవించడంతో పలువురు ఎస్ఆర్లు, పీజీలు కూడా డ్యూటీలకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటున్నారు.


