నెల్లూరు(అర్బన్): 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు తాము చేసిన అభివృద్ధిని శకటాల ప్రదర్శనలో చూపారు. ఇందులో నగరపాలక సంస్థ మొదటి, పంచాయతీరాజ్ శాఖ రెండో, వ్యవసాయశాఖ మూడో బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే ఆయాశాఖలు వివిధ స్టాళ్లను ప్రదర్శించాయి. డీఆర్డీఏ, మెప్మా, గిరిజన సంక్షేమ శాఖలు ప్రదర్శించిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. గత సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను మంత్రి, కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా 521 మందికి అవార్డులు అందజేశారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
దేశభక్తి ఉప్పొంగేలా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరేడ్ గ్రౌండ్లో అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేశారు. జాతీయ సమైఖ్యతను, స్వాతంత్య్ర కాంక్షను, అహింసను తెలుపుతూ ప్రదర్శనలు సాగాయి. పొదలకూరు జెడ్పీ బాలికల హైస్కూల్, పొదలకూరుకు చెందిన అమరావతి ఇంగ్లిష్ మీడియం, గొలగమూడికి చెందిన బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, బుజబుజ నెల్లూరు శేషు ఇంగ్లిష్ మీడియం పాఠశాల, మాగుంట లేఅవుట్లోని ఓవెల్ పాఠశాల, ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్, అవెన్యూ పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు.


