నెల్లూరు(అర్బన్): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా జూనియర్ డాక్టర్లు తమ విధులు బహిష్కరించి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకపోవడంతో శనివారం నుంచి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్ కుమార్ మాట్లాడుతూ తాము కేవలం స్టైఫండ్ పెంచాలని, డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల వరకు మాత్రమే ఉంచాలని, ఎంబీబీఎస్, పీజీ చేసిన వారి ద్వారానే జూనియర్ డాక్టర్లకు వైద్య విద్య బోధించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. జూనియర్ డాక్టర్లు భార్గవ్, అనంత్, హేమంత్, ఇవాన, రూపేంద్ర, ఇర్ఫాన్, వర్షిత, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన నిధికి రూ.1.21 లక్షల విరాళం
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో నిత్యాన్నదాన నిధికి హైదరాబాద్కు చెందిన సోమిశెట్టి ప్రవళ్లిక కుటుంబసభ్యులు రూ.1,21,173లను శనివారం ఈఓ గిరికృష్ణకు చెక్ ద్వారా విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ మర్యాదలతో పూజలు జరిపించి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్రయాదవ్, అర్చకుడు పులికొలను చంద్రశేఖర్ పాల్గొన్నారు.
147 గ్రాముల వెండి బహూకరణ
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని నరసింహకొండ వేదగిరి క్షేత్రంలో స్వామివారికి నెల్లూరుకు చెందిన ఆల్తూరు గిరీష్రెడ్డి, లత దంపతులు శనివారం 147 గ్రాముల వెండి కాసులను బహూకరించారు. అదే విధంగా నిత్యాన్నదానానికి నెల్లూరుకు చెందిన గుంజి మనోహర్, శ్రీవాణి దంపతులు రూ.12 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు, నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.


