చిల్లకూరు: చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో తన అనుచర గణం సుమారు 200 మందితో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య పరిచయ వేదిక మోమిడిలో నిర్వహించిన కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి శీనయ్య వైఎస్సార్సీపీలోకి అడుగు పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో కొనసాగాలని చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని ఎంతోమంది ఆయా పార్టీలను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శీనయ్యకు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇండియా పోస్ట్ ద్వారా రాఖీలు పంపండి
నెల్లూరురూరల్: రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల్లో నివసిస్తున్న సోదరులకు రాఖీలు, రాఖీ కవర్లు, బహుమతులను పంపేందుకు ఇండియా పోస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు నుంచి దేశీయ గమ్యస్థానాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా, విదేశాలకు ఐటీపీఎస్/స్పీడ్ పోస్ట్ సేవల ద్వారా పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సేవలకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. చివరి నిమిషంలో కాకుండా రాఖీలను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. విదేశాలకు రాఖీలు పంపే వారు సంబంధిత పోస్టల్, కస్టమ్స్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు.
పొట్టు ట్రాక్టర్ను ఢీకొన్న టిప్పర్
● ముగ్గురికి గాయాలు
వెంకటాచలం: పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సర్వేపల్లి నుంచి కృష్ణపట్నం పోర్టు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తోపాటు టిప్పర్లో ఉన్న డ్రైవర్లు మణి, రాజేష్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను పక్కకు తొలగించారు.
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర, జిల్లా, సిటీ అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాలలో నియమిస్తూ శుక్రవారం కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ సెక్రటరీగా నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందిన ఊటుకూరు నాగార్జున, జిల్లా యువత అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి నియమితులయ్యారు.


