నెల్లూరు (బారకాసు): రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మంత్రి నారాయణకు కట్టబెట్టేందుకు అత్యవసరంగా కౌన్సిల్ సమావేశం పెట్టించారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని మంత్రి ఆక్రమిస్తే కొన్నేళ్లుగా ఆయన స్వాధీనంలో ఉందంటూ జీఓల ఆధారంగా అధికారికంగా ఆ భూమిని మార్కెట్ వాల్యూకు అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కౌన్సిల్ సమావేశంలో పెట్టడం సిగ్గు చేటంటూ 13వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున నిలదీశారు. ప్రశ్నించిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ఫిరాయింపు కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. నిగ్గదీసిన వారిని కొట్టేందుకు వచ్చారు. ప్రజాసమస్యలు, తమ అభిప్రాయాలు చెప్పనీయకుండా గొంతు నొక్కేశారు. చివరకు చర్చ లేకుండానే.. ఆల్ పాస్తో మంత్రి నారాయణకు మద్దతుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో బుధవారం మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సంపద సృష్టి అంటే
ప్రజలపై భారం మోపడమా?
21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్లగౌరి మాట్లాడుతూ.. పారిశుధ్య సిబ్బంది కొరత, దోమల నివారణలో వైఫల్యం, చెత్త సేకరణలో లోపాలపై అధికారుల తీరును తప్పుబట్టారు. ప్రజలకు విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి మౌలిక సేవలకు యూజర్ చార్జీలు వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రజలపై అదనపు భారం మోపడమేనన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలకు సంబంఽధించి విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి 16రకాలసేవలను ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచి యూజర్ చార్జీలు కలెక్ట్ చేసే ఉత్తర్వులు దారణమన్నారు. 29వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే సత్తార్ మాట్లాడుతూ.. ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నా వాటి జోలికి వెళ్లకుండా ఎండకు ఎండుతూ, వానకు తడస్తూ రోడ్డు వెంబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదల కడుపు కొట్టడం దారుణమన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తన డివిజన్లో అభివృద్ధి పనులు తనకు తెలియకుండానే జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కో–ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జునయాదవ్ నగరంలో రోడ్లు, ఫుట్పాత్లు, డ్రైన్ల ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేయర్కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మద్దినేని మస్తానమ్మ, మొగళ్లపల్లి కామక్షిదేవి, వేనాటి శ్రీకాంత్రెడ్డి, షేక్ ఫామీదా, గుంజి జయలక్ష్మి, నీలి రాఘవరావుతోపాటు పలువురు ఫిరాయింపు కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, ఎన్ఎంసీలోని అన్ని విభాగాధిపతులు పాల్గొన్నారు.
మంత్రి నారాయణకు రూ.కోట్ల
విలువైన ప్రభుత్వ స్థలం అప్పగింతకు
గ్రీన్ సిగ్నల్
అభ్యంతరం వ్యక్తం చేసిన
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై
ఫిరాయింపు కార్పొరేటర్ల దౌర్జన్యం
ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా గొంతు నొక్కిన వైనం
చర్చలేకుండానే అజెండాలోని
అంశాలన్ని ఆల్పాస్
కార్పొరేటర్ల మధ్య ఆద్యంతం రగడ
అజెండాలోని 150 అంశాలను సెక్రటరీ శ్రీలక్ష్మి చదివి వినిపించారు. అయితే 116వ అంశాన్ని చదువుతుండగా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన డివిజన్ పరిధిలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి మంత్రి నారాయణ అధీనంలో ఉందంటే కబ్జా చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని మంత్రికి సంబంధించిన సంస్థకు తక్కువ ధరకు ఎలా అప్పగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునకు తోడుగా పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిలిచారు. దీంతో పలువురు ఫిరాయింపు కార్పొరేటర్లు ఒక్కసారిగా తమ మంత్రినే విమర్శిస్తావా అంటూ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ, ఫిరాయింపు కార్పొరేటర్ల మధ్య ఆద్యంతం రగడ చోటు చేసుకుంది. ఓ దశలో మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కమిషనర్ నందన్ జావాబిస్తూ మంత్రి నారాయణ సంస్థ అధీనంలో ఉన్న స్థలం ఇరిగేషన్కు సంబంధించిందని కార్పొరేషన్కు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా అభ్యంతరం ఉంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకోవాలని లేదంటే కోర్టుకై నా వెళ్లండంటూ చెప్పారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలియజేస్తూ కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్కు సంబంధించిన కాపీని కమిషనర్కు అందజేశారు. చివరకు 116 అంశానికి సంబంధించి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వ్యతిరేకించినప్పటికీ.. ఫిరాయింపు కార్పొరేటర్ల బలం ఉండడంతో ఆమోద ముద్ర వేసుకున్నారు.


