మర్రిపాడు: 2026–27 పంట కాలానికి ఎఫ్సీవీ పొగాకు రైతులకు ఒక బ్యారన్కు రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వేలం నిర్వహణాధికారి జి సునీల్కుమార్ గురువారం తెలిపారు. పంట అవసరాల కోసం ఈ రుణాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీపీఏ, బ్యారెన్ ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు మాత్రమే రుణం వర్తిస్తుందని తెలిపారు. రుణం కోసం బ్యాంక్ పాస్బుక్ కాపీ, పొగాకు బోర్డు పుస్తకం రెండు వైపుల జిరాక్స్, ఇద్దరు హామీదారుల బోర్డు పుస్తకాల రెండు వైపుల జిరాక్స్ సమర్పించాలని సూచించారు. సంబంధిత పత్రాలతో ఫీల్డ్ సూపర్ వైజర్ను సంప్రదించాలని కోరారు. ఒక రైతు గరిష్టంగా ఇద్దరు రైతులకు మాత్రమే హామీ సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్యారెన్ లీజుకు తీసుకున్న రైతులు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే యజమాని కూడా సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత ఉన్న పొగాకు రైతులు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జి సునీల్కుమార్ సూచించారు.
సమ్మెను ఆపే ప్రసక్తే లేదు
● జూనియర్ డాక్టర్లు
● రోగులకు తప్పని తిప్పలు
నెల్లూరు(అర్బన్): తమ డిమాండ్లు తీర్చే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నెల్లూరు సర్వజన ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హనీష్కుమార్ మాట్లాడుతూ తాము కోరేవి చాలా చిన్న డిమాండ్లు అని అన్నారు. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడం బాధాకరమన్నారు. రోగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అత్యవసర వైద్యసేవలకు హాజరవుతున్నామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేస్తామన్నారు. సుమారు 200 మందికిపైగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. దీంతో సాధారణ సేవలకు ఆటంకాలు, వైద్యసేవలు ఆలస్యమవుతున్నా యి. రాత్రి డ్యూటీలు ఆపేస్తే రోగులకు మరింత ఇబ్బందిగా మారుతోంది. అందువల్ల ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు అంగీకరించి సమ్మెను విరమింపజేయాలని రోగులతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో భావన, భార్గవ్, సాయి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 82,800 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


