దేవస్థానానికి సంబంధించిన దుకాణాలు ప్రధాన రహదారికి ముఖ ద్వారాలుగా ఉన్నాయి. దీంతో ప్రతి షాపు నుంచి పన్నులను మున్సిపాల్టీకి చెల్లించాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన పాలకమండలి పగ్గాలు చేపట్టాక, ఇది నిలిచిపోయింది. ఫలితంగా గ్రూప్ దేవస్థానాల కార్యాలయంతో పాటు దుకాణాలను ఏప్రిల్లో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అప్పట్లో బకాయిలను యజమానులే చెల్లించి వ్యాపారాలను నిర్వహించుకున్నారు. విద్యుత్ బిల్లులను సైతం చెల్లించకపోవడంతో కార్యాలయానికి సరఫరాను నిలిపేశారు. రూ.లక్షల్లో ఆదాయమొస్తున్నా, ఇలా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
లీజులు.. ఆపై సబ్ లీజులు
దేవస్థాన దుకాణాల కాంప్లెక్స్లో అసలు లీజుదారులు ఎప్పుడో కనుమరుగయ్యారు. మరో వైపు వీటికి దక్కించుకున్న వారు రూ.లక్షలను తీసుకొని సబ్ లీజులకు ఇస్తున్నారు. పాలక మండలితోపాటు ఈఓకు ఈ విషయం తెలిసినా, ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. పైగా అనధికార వ్యక్తులకు రూ.పది వేల నుంచి రూ.15 వేల వరకు అద్దె చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఇవ్వలేకపోతున్నామంటూ ఎవరైనా వస్తే వెంటనే షాపులకు బేరం పెట్టి మరొకరికి రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు. తమ వాటాను తీసుకొని పబ్బం గడిపేస్తున్నారు. ఈ విషయమై ఈఓను సంప్రదించగా, దుకాణాలను తొలిగా ఎవరికి కేటాయించారో వారే ఉన్నారని, అయినా దృష్టి సారిస్తామని బదులిచ్చారు.


