● మరొకరికి తీవ్ర గాయాలు
● మహిమలూరులో ఘటన
● ధ్వంసమైన ఇల్లు
ఆత్మకూరు రూరల్: మండలంలోని మహిమలూరులో మంగళవారం గ్యాస్ లీకై సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నిజమాల లక్ష్మమ్మ (75).. మాజీ ఎంపీటీసీ చింతలపల్లి కవితమ్మ ఇంట్లో పనిచేస్తున్నారు. బంధువుల మృతితో నెల్లూరులో జరిగే కార్యక్రమానికి కవితమ్మ వెళ్లింది. ఈ క్రమంలో గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించిన లక్ష్మమ్మ పక్కింటికి చెందిన షేక్ జమీలాను సాయం కోసం పిలిచింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి ట్యూబ్లైట్ స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతోపాటు వంటగది, ఇంటిలోని కొంత భాగం దెబ్బతింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి లక్ష్మమ్మ చనిపోయింది.
● అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జమీల భర్త ఖాదర్ హుస్సేన్ కువైట్లో ఉన్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం. ఘటన గురించి తెలిసిన వెంటనే అతను స్వదేశానికి బయలుదేరాడు. వంటగది స్లాబ్ జమీలపై తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆమెను అపోలో నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నెకు తీసుకెళ్లారు.
స్విచ్ వేయడంతోనే మంటలు
సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంటగదిలో గ్యాస్ లీకై నిండిపోయిన సమయంలో ట్యూబ్ లైట్ స్విచ్ వేయడంతో ఏర్పడిన మంటల కారణంగా సిలిండర్ పేలినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్సై జంపానీ కుమార్ దర్యాప్తు చేపట్టారు.


