నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
సీతారామపురం: మండలంలోని పండ్రంగి గ్రామ సమీపాన ఆదివారం ట్రాక్టర్ పైనుంచి పడి జార్ఖండ్కు చెందిన సుక్రం చటుంబా అనే యువకుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్పై నిలబడి ప్రయాణిస్తున్న చటుంబా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో కుడికాలు విరిగింది. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలించారు.
20 బస్తాల
రేషన్ బియ్యం పట్టివేత
గూడూరురూరల్: గూడూరు మండలం చవటపాళేనికి చెందిన బాలకిషోర్ అనే వ్యక్తి ఆటోలో 20 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా గూడూరు డిప్యూటీ తహసీల్దార్ చైతన్య, సిబ్బంది పట్టుకున్నారు. జాతీయ రహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని తిలక్నగర్ ప్రాంతంలోని గోదాముకు అప్పగించారు. అనంతరం ఆటోను సీజ్ చేసి గూడూరు రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఓజిలి మండలం ఆర్మేనిపాడులో ప్రజల నుంచి కిలో రూ.16 చొప్పున రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, నెల్లూరులోని రైస్ మిల్లులో అధిక ధరకు విక్రయించేందుకు ఆటోలో తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ మేరకు బాలకిషోర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరుపూరులో
ఆలయాల్లో చోరీలు
పొదలకూరు: మండలంలోని మరుపూరు గ్రామం కామాక్షి సమేత మల్లికార్జునస్వామి ఆలయం, సాయిబాబా మందిరంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కరెంట్ లేని సమయంలో మల్లికార్జునస్వామి దేవస్థానం గ్రిల్స్కు ఉన్న తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీని అపహరించారు. దానిని సమీపంలోని చెరువు కట్టకు తీసుకెళ్లి పగులగొట్టి అందులోని సుమారు రూ.8 వేల నగదును తీసుకెళ్లారు. ఇదే దేవస్థానంలో గతేడాది దుండగులు హుండీని అపహరించారు. సాయిబాబా మందిరంలో ఇదే తరహాలో హుండీని ఎత్తుకెళ్లి సమీపంలోని చంద్రశేఖర్రెడ్డి తోటలో పగులగొట్ట అందులో ఉన్న నగదును తీసుకెళ్లిపోయారు. పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు.
కండలేరులో
23.95 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 23.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
పొదలకూరు
నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.70
సన్నవి: రూ.30
పండ్లు: రూ.15


