● మేకపాటి సమక్షంలో
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంతో ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, దీనివల్ల టీడీపీలో ఇమడలేక నాయకులు ఆ పార్టీని వీడుతున్నట్లు వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. సీతారామపురం మండలం బసినేనిపల్లి, నెమళ్లదిన్నెతో పాటు పలు పంచాయతీలకు చెందిన టీడీపీ యువ కార్యకర్తలు శనివారం ఆ మండల యువనేత చింతంరెడ్డి లోకేశ్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని దీక్షా శిబిరం వద్ద రాజగోపాల్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే బసినేనిపల్లికి చెందిన నానిపోగు మనోహర్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మేకపాటి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. రెండేళ్ల ప్రజా వ్యతిరేక పాలనతో అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు భారీగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీసీ మండల యూత్ అధ్యక్షుడు పాలగిరి ముద్దుకృష్ణంరాజు, మండల ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడు కప్ప సురేంద్రరాజు, ఇతర నేతలు కప్ప శ్రీనివాసరాజు, ముకుంద విక్రమ్, పాలకొలను సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


