● డీఆర్వో విజయకుమార్
నెల్లూరురూరల్: ‘ప్రగడ కోటయ్య చేనేత కార్మికులు, రైతులు, బలహీనవర్గాల సంక్షేమానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయం’ అని డీఆర్వో విజయకుమార్ అన్నారు. కోటయ్య జయంతిని ఆదివారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కోటయ్య చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి, రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించడం ద్వారా మరిన్ని సహకార సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కోటయ్య వంటి మహనీయుల జీవితాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య మాట్లాడుతూ కోటయ్య యుక్త వయసు నుంచే చేనేత, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ కార్మికుల కోసం కూడా భూ పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు బైన ఏడుకొండలు (పాటూరు), పొనగంటి సింహబలుడు నారాయణరెడ్డి, కుండా సుబ్బారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి దావులూరి ఐజయ్య, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తల్లా నరసింహస్వామి, రాష్ట్ర చేనేత సంఘాల నాయకులు కేవీ శేషయ్య, కాటికాల వెంకటేశ్వర్లు, బి.బాలాజీ, జె.రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


