ఆత్మకూరు: జైళ్లలో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతూ.. ఖైదీల్లో పరివర్తన వచ్చేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. పట్టణంలోని సబ్ జైలును స్థానిక సీనియర్ సివిల్ జడ్జి గాయత్రితో కలిసి గురువారం ఆమె తనిఖీ చేశారు. పలువురు ఖైదీలతో మాట్లాడి.. జైల్లో సమస్యలేమైనా ఉన్నాయా.. అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారాననే విషయాలను ఆరాతీశారు. అనంతరం జైల్లోని వంటశాల, తయారైన పదార్థాలు, స్టోర్ రూమ్, బాత్రూమ్లలో పరిశుభ్రత తదితరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని జైళ్లలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని వివరించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. అడ్వొకేట్ ఓబులేసు, లోక్ అదాలత్ సభ్యుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


