నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో రాస్తారోకో జరిగింది. అనంతరం రామ్మూర్తి నగర్ విద్యుత్ సెక్షన్ కార్యాలయం ఎదుట కరెంట్ బిల్లులను నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రూఅప్ చార్జీలు రద్దు చేస్తామని, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు వేయమని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. వీరు అధికారంలో లేనప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్లో ఒకరు 53 విద్యుత్ యూనిట్లు వాడినందుకు రూ.126 బిల్లు రావాల్సి ఉండగా అదనపు చార్జీలు, ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.687 బిల్లు వచ్చిందన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్కు వినియోగదాడికి రూ.14 వేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని గతంలో లోకేశ్ పిలుపునిచ్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను పగులగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు నరసింహ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, జాఫర్, ఫయాజ్, రమణారెడ్డి, చెంగయ్య, శాఖా కార్యదర్శులు సంపూర్ణమ్మ, రాజ్యలక్ష్మి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, మురళి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
సబ్స్టేషన్ ఎదుట కరెంట్ బిల్లుల దగ్ధం