మహిళలపై కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

మహిళలపై కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

Aug 10 2023 7:10 AM | Updated on Aug 10 2023 12:33 PM

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు  - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కృష్ణ తమపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించాడని, అతన్ని సస్పెండ్‌ చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళలు బుధవారం ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. వింజమూరు గంగమిట్టకు చెందిన మహిళలు మంగళవారం అర్ధరాత్రి స్థానిక సబ్‌స్టేషన్‌కు వెళ్లి విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై సిబ్బందిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్‌ కృష్ణ మహిళలనుద్దేశించి అసభ్య పదాలు ఉపయోగించాడు.

ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుమణిగేలా చేశారు. అయితే తీవ్ర కలత చెందిన మహిళలు, వారి బంధువులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నాకు దిగారు. ఎస్సై కోటిరెడ్డి వారికి సర్దిచెప్పి కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యుత్‌ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు విజయకుమార్‌రెడ్డి, కొండారెడ్డి, కాలేషా తదితరులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యుత్‌ సమస్యను ఏఈ శ్రీనివాసరావు దృష్టికి సాక్షి తీసుకెళ్లగా గంగమిట్టలో లోఓల్టేజీ సమస్య ఉందని, దీనివల్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరైందని, రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement