సాక్షి, విశాఖ : ఇటీవల బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మంగళవారం(జూలై 14వ తేదీన) పరామర్శిస్తారని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏవీఎన్ కాలేజ్ జబ్బర్ పేట సమీపంలో గల మత్య్సకారుల ఇళ్లకు వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి పరామర్శిస్తారని తెలిపారు.
విశాఖలో ఈరోజు(ఆదివారం) కన్నబాబు మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాద బాధితుడైన కారె చిన్నాను ఇటీవలే ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శించారని పేర్కొన్నారు. నిన్న శనివారం మత్స్యకారుల కుటుంబాలని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే.
కాగా జులై 4న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్నా అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి జాడ దొరకలేదు. అయితే ఈ ఘటనపై వేసిన త్రీ మెన్ కమిటీ మాత్రం గల్లంతైన వారు మృతిచెందినట్లు ప్రకటించింది. వారి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ను మధ్యలోనే ముగించి.. ఆరుగురు మత్స్యకారులు మృతిచెందినట్లు వెల్లడించింది.
ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్షంగా వ్యవహరించిందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదం 4 వతేదీన చోటు చేసుకోగా ఆ తరువాతి రోజు సహాయక చర్యలు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు.


