
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా మూడో ఐసీసీ టోర్నమెంట్లోనూ నిరాశపరిచింది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్కప్-2024 టోర్నీల్లో గ్రూపు స్టేజిలో ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్.. ఇప్పుడు తమ సొంత గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచింది. న్యూజిలాండ్, భారత్ చేతుల్లో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్.. లీగ్ స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది.
పాకిస్తాన్కు ఎంత మంది కోచ్లు మారుతున్నా, ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. రోజురోజుకు పాక్ క్రికెట్ పరిస్థితి మరింత అద్వానంగా తాయారుఅవుతోంది. ఆఖరికి వారి దేశ మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుకు అండగ నిలవడం లేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విరుచుకుపడుతున్నారు. బాబర్ ఆజం ఒక మోస గాడని అక్తర్ విమర్శించగా.. పాక్ క్రికెటర్లకు ఆట కంటే తిండే ఎక్కువ అని అక్రమ్ హేళన చేశాడు.
అయితే సొంత దేశ ఆటగాళ్లే సపోర్ట్గా నిలవని పాక్ జట్టుకు.. భారత మాజీ క్రికెటర్, లెజెండరీ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. పాక్ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలపై యోగరాజ్ మండిపడ్డాడు. విమర్శలు చేసే బదులుగా ఒక మంచి జట్టును తాయారు చేయవచ్చుగా అంటూ పాక్ మాజీ క్రికెటర్లకు యోగరాజ్ చురకలు అంటించాడు.
"వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు ఏమి చేస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. క్రికెట్ కామెంట్రీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మీ దేశానికి తిరిగి వెళ్లి క్రికెట్ శిబిరాలను నిర్వహించి, మంచి టీమ్ను తాయారు చేయవచ్చుగా. మీ జట్టుపై మీరే విమర్శలు చేసుకుంటే ఏమి వస్తుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. మీలో ఎవరు పాకిస్తాన్ ప్రపంచ కప్ గెలవడానికి కృషి చేస్తారో చూడాలనుకుంటున్నాను. లేకుంటే నేనే పాకిస్తాన్కు వెళ్లి ఓ మంచి జట్టును తాయారు చేస్తాను" అని యోగరాజ్ పేర్కొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా యోగరాజ్ సింగ్ సొంతంగా క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఆయన అర్జున్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.
చదవండి: 'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి'