WPL 2023: డబ్ల్యూపీఎల్‌ వేలానికి వేళాయె.. వివరాలివే

WPL 2023: WPL Auction on 12 Feb 2023 - Sakshi

మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్పోర్ట్స్‌ 18  చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్‌ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మహిళా లీగ్‌ వేలం మహిళ మల్లిక సాగర్‌ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్‌ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.

ఇందులో భారత్‌ నుంచి 246 మంది... విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుక సింగ్, రిచా ఘోష్‌ (భారత్‌), ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, అలీసా హీలీ, మేగన్‌ షుట్‌ (ఆస్ట్రేలియా), నాట్‌ సివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), డియాండ్ర డాటిన్‌ (వెస్టిండీస్‌) తదితరులకు భారీ మొత్తం లభించే అవకాశముంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, గుజరాత్‌ జెయింట్స్, యూపీ వారియర్జ్‌ జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్‌ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top