కోహ్లి ఎందుకిలా చేశావు..

Virat Kohli Takes The Blame For Dropped Catches Of KL Rahul Of KXIP - Sakshi

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లి.. ఎంత మంచి ఫీల్డర్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉన్నడంటే పాదరసంలా కదులుతూ పరుగులు రాకుండా నియంత్రించగలడు. కానీ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి నాసిరకం ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశాడు. కింగ్స్‌ విజయంలో కీలకంగా నిలిచిన ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహల్‌ క్యాచ్‌లను రెండుసార్లు మిస్‌చేశాడు. రాహుల్‌ 83,  89 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి జారవిడచాడు. ఫలితం రాహుల్‌ 69 బంతుల్లో 132 పరుగులు చేసి కింగ్స్‌ పంజాబ్‌కు 200 పైగా స్కోరు అందించడం .. చేదనలో ఆర్‌సీబీ ఒత్తిడికి లోనై 97 పరుగులతో ఘోరపరాజయం పాలైంది. ఆర్‌సీబీ ఓడిపోయిందంటే దానికి పరోక్ష కారణం కోహ్లియేనని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు. కోహ్లి ఎందుకిలా చేశావంటూ విమర్శించారు. అయితే మ్యాచ్‌ అనంతరం కోహ్లి స్పందించాడు. (చదవండి : ఆర్‌సీబీపై రాహుల్‌ పంజా)

'ఈరోజు మా జట్టు ప్రదర్శన అంత బాగాలేదు. బ్యాటింగ్‌లో పూర్తిగా ఒత్తిడికి లోనై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్‌లో నా తప్పిదం కూడా ఉంది. కింగ్స్‌ స్కోరు 143, 156 వద్ద ఉన్నప్పుడు కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌లను జారవిడిచాను. ఒకవేళ క్యాచ్‌ అందుకొని ఉంటే.. 30 నుంచి 40 పరుగులు సేవ్‌ అయ్యేవి. రాహుల్‌ ఔటయ్యాక ఒకవేళ కింగ్స్‌ను 180 పరగుల లోపు నియంత్రించి ఉంటే మా ఇన్నింగ్స్‌లో మొదటి బంతి నుంచి ఒత్తిడికి లోనయ్యేవాళ్లం కాదు. అయినా మాకు ఈరోజు ఇలా రాసి పెట్టే అంగీకరించడం తప్ప ఏం చేయలేమంటూ' చెప్పుకొచ్చాడు.

ఇక బ్యాటింగ్‌లోనూ కోహ్లి ఆకట్టుకోలేకపోయాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న విరాట్‌ ఒక్క పరుగే చేసిన కాట్రెల్‌ బౌలింగ్‌లో రవి బిష్ణోయికు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతేకాదు తనకు అచ్చి వచ్చిన మూడో నెంబర్‌ స్థానం కాదని జోష్‌ పిలిపి కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్‌ విషయంలో స్పందించిన కోహ్లి.. 'మొదటి మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నదేవదూత్‌ పడిక్కల్‌పై అందరి కళ్లు పడ్డాయి. ఒత్తిడికి లోనైన పడిక్కల్‌ రెండో బంతికే వెనుదిరిగాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన జోష్ ఫిలిప్‌ పై ఉన్న నమ్మకంతో మూడో స్థానంలో పంపించాను. కానీ అనూహ్యంగా అతను విఫలమయ్యాడు. అయితే స్థిరంగా ఆడాల్సిన నేను కూడా విఫలమవ్వడం.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడం.. ఒత్తిడి పెరగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.' అని తెలిపాడు.

కాగా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా కోహ్లి జరిమానాకు గురయ్యాడు.ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం ఆర్‌సీబీకి మొదటిసారి స్లో ఓవర్‌ రేట్‌ కావడంతో కెప్టెన్‌ కోహ్లికి మ్యాచ్‌ ఫీజులో రూ. 12 లక్షల జరిమానా విధించింది.ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను సెప్టెంబర్‌ 28న ఎదుర్కోనుంది.(చదవండి : సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది) 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top