'సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది' | Sakshi
Sakshi News home page

సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది : పీటర్సన్‌

Published Thu, Sep 24 2020 2:01 PM

Kevin Pietersen Disagrees Dhoni justification Behind Batting At No 7 - Sakshi

లండన్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో చెన్నై మ్యాచ్‌ ఆడి రెండు రోజులు గడుస్తున్నా ఎంఎస్‌ ధోని ఏడో స్థానంలో రావడంపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. మంచి ఫినిషర్‌గా పేరున్న ధోని ఇలా ఏడో స్థానంలో రావడం ఏంటంటూ మాజీ క్రికెటర్లు గంబీర్‌, సునీల్‌ గవాస్కర్‌ పెదవి విరిచారు. దీనిని ధోని సమర్థించుకుంటూ.. క్వారంటైన్‌లో ఎక్కువ రోజులు ఉండడం వల్లే తనకు ప్రాక్టీస్‌ దొరకలేదని, పూర్తి సన్నద్ధత లేకపోవడం వల్ల ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని చెప్పడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ధోనికి చురకలంటించాడు. స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో కెవిన్‌ పీటర్సన్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : 'కోల్‌కతాపై విజయం మాలో జోష్‌ నింపింది')

'ధోని విషయంలో ఇదంతా నాకు నాన్ సెన్స్‌గా అనిపిస్తుంది.. ఏ జట్టుకైనా క్వారంటైన్ నిబంధనలను ఒకలాగే ఉంటాయి. మిగతా జట్లలోని ఆటగాళ్లు రాణించినప్పుడు ధోనికి మాత్రం ఎందుకు కష్టమనిపిస్తుంది. ఏది ఏమైనా సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది. అయినా ఇదేమీ ప్రయోగాలు చేసేందుకు సమయం కాదు. ప్రస్తుతం మనం ఐపీఎల్‌ టోర్నీలో తొలి దశలోనే ఉన్నాము.  టీ-20లో ఏది జరిగినా చాలా త్వరగా అభిమానుల్లోకి వెళ్లిపోతుంది. వరుసగా ఐదు గేముల్లో ఓడిపోయిన జట్టు కూడా తర్వాత మ్యాచ్‌లు దాటిగా ఆడి ఫైనల్స్ వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంతేకాని మ్యాచ్‌ ఓటమి అనంతరం ఇలాంటి సాకులు చెప్పాలని చూడొద్దు 'అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ‘ధోని కొట్టిన బంతి దొరికింది’)

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో శామ్ కర్జన్‌ లేదా రవీంద్ర జడేజాలను ముందు పంపడం సరైన నిర్ణయమే కావచ్చు... అయితే ధోనికి తన మార్క్‌ ఇన్నింగ్స్‌ చూపించే వరకు అవకాశాల కోసం ఎదురుచూడడం వ్యర్థం. క్రీజులోకి రాగానే బ్యాట్ కు పని చెబితేనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇకనైనా ధోనిలాంటి అనుభవజ్ఞులు రాబోయే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు తమ బాధ్యత నెరవేరుస్తారనే అనుకుంటున్నా. అంటూ' తెలిపాడు. 

Advertisement
Advertisement