ఎంఎస్ ధోనీ లేకుంటే చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభంమైనప్పటి నుంచి ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే ఐదుసార్లు చాంపియన్గా నిలిచింది.
మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహా మిగతా సీజన్లలో సీఎస్కే కనీసం ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్కు తొలుత రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో మరోసారి ధోనీనే జట్టును నడిపించాడు.
తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 28 నుంచి షురూ కానున్న నేపథ్యంలో సీఎస్కే ఈసారి టైటిల్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించడం కష్టంగా ఉంటుంది. అలాగే ధోనీ లేకపోతే ఐపీఎల్ కూడా ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. బహుశా ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. సంజూ శాంసన్ జట్టులో చేరడం, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉండడంతో ఈసారి ధోనీ వారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎందుకంటే సంజూతో పాటు రుతురాజ్ చాలాకాలం పాటు సీఎస్కేలో కొనసాగే అవకాశముంది.
అయితే ఈ సీజన్లో ధోనీ ఎన్ని మ్యాచ్లు ఆడుతాడన్నది సరిగ్గా తెలియనప్పటికీ జట్టుతో ఉంటే చాలు డ్రెస్సింగ్ రూమ్లో కొండంత బలం ఉంటుంది. ముఖ్యంగా చెన్నై భవిష్యత్తు కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదిగేందుకు ధోనీ సలహాలు చాలా వరకు ఉపయోగప డనున్నాయి. అంతేకాదు రుతురాజ్ ఇప్పటికే కెప్టెన్గా చేసిన అనుభవం ఉండడం కూడా కలిసొచ్చే అంశం.
ఇక ధోనీ ఫిట్నెస్, బ్యాటింగ్ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఫిట్నెస్ పరంగా చూస్తే ధోనీ అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. పైగా ఇదే సీజన్ అతనికి చివరిది కూడా అయ్యే చాన్స్ ఉంది. అందుకే ఈ సీజన్లో కప్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా ఉంది’ అని పఠాన్ పేర్కొన్నాడు.
అయితే ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అనే మాట వినిపించడం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ సీజన్లో ధోనీ సీఎస్కే తరఫున కెప్టెన్గా ఆడతాడా లేదంటే ఆటగాడిగా కొనసాగుతాడా అనే దానిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టతనిచ్చారు. ఈ సీజన్లో ధోనీ అన్ని మ్యాచ్లు ఆడుతాడని, కానీ అతని రోల్ ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు.


