క్రికెట్లో లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఎన్నో మ్యాచ్లకు ఈ స్టేడియం వేదికగా నిలిచింది. 1983లో లార్డ్స్ వేదికగానే జరిగిన ప్రపంచకప్లో కపిల్ డెవిల్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
అంతేకాదు 2001లో నాట్వెస్ట్ సిరీస్ టోర్నీ సందర్భంగా టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆనాటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ స్టేడియం బాల్కనీలో నుంచి తన చొక్కా విప్పి తిప్పిన సంఘటన ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో ఇంకా కదలాడుతూనే ఉంది.
అనేక జ్ఞాపకాలకు నెలవైన లార్డ్స్ స్టేడియం బీర్లకు కూడా ప్రసిద్ధి చెందింది. లార్డ్స్ మైదానంలోని లాన్లో కూర్చుని బీరు తాగుతూ మ్యాచ్ను వీక్షిస్తుంటే వచ్చే మజా వేరుగా ఉంటుంది. అయితే లార్డ్స్ స్టేడియంలో ఇక మీదట ఆ అవకాశం లేకపోవచ్చు.
ఎందుకంటే లార్డ్స్ స్టేడియానికి బీర్లను సరఫరా చేసే బ్రూడాగ్ బెవరేజ్ సంస్థతో ఒప్పందం ముగిసినట్లు మెరిల్బోన్ క్రికెట్ లీగ్ (ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్రూడాగ్ స్థానంలో టిల్ రే బ్రాండ్స్కు బీర్ల అమ్మకాలకు అవకాశం ఇస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుందన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడించకపోవడంతో అప్పటివరకు లార్డ్స్ స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరగవని తెలిపింది.
అయితే ఎంసీసీ, బ్రూడాగ్లు 2024లో వచ్చే నాలుగేళ్ల కాలానికి బీర్ల సరఫరా, అమ్మకాలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల సంవత్సరం తిరగకముందే ఒప్పందం ముగింపుకు రావడం గమనార్హం.బ్రూడాగ్తో ఒప్పందం జరిగిన మొదటి ఏడాదిలో లార్డ్స్ స్టేడియంలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగడం తమకు ఆనందాన్ని కలిగించిందని ఎంసీసీ పేర్కొంది.
ఈ బంధం శాశ్వతంగా కొనసాగుతుందనుకున్నప్పటికీ ఒక ఏడాదితోనే ముగిసిపోయిందని తెలిపింది. ఇక బ్రూడాగ్ సంస్థ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్తో పాటు ప్రీమియర్ ఫుట్బాల్ లీ2్ వెస్ట్హామ్ యునైటెడ్తో స్పాన్సర్షిప్తో పాటు ఇంగ్లీష్ రగ్బీ సూపర్ లీగ్కు చెందిన సెంట్ హెలెన్స్ స్టేడియంతో బీర్ల అమ్మకాలకు పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.


