న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టులోని కీలక సభ్యులు జేకబ్ ఓరమ్ (బౌలింగ్ కోచ్), లూక్ రాంచీ (బ్యాటింగ్ కోచ్) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విధులు కాదని పరాయి దేశ ఫ్రాంచైజీ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్కు ప్రాధాన్యమిచ్చారు. వీరి అభీష్టానికి ఆ దేశ క్రికెట్ బోర్డు అడ్డు చెప్పకపోగా, అనుమతి ఇవ్వడం ఆసక్తికరం.
ఓరమ్, రాంచీ త్వరలో ప్రారంభం కానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఎడిషన్ (మార్చి 26) కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీతో పని చేయనున్నారు. రాంచీ హెడ్ కోచ్గా.. ఓరమ్ అదే ఫ్రాంచైజీకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తారు. రాంచీ గతంలో పీఎస్ఎల్లో మూడు సీజన్లు ఆటగాడిగా కూడా ప్రాతినిధ్యం వహించాడు.
ఓరమ్, రాంచీ పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే సమయంలో న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్.. ఆతర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది.
ఓరమ్, రాంచీ జాతీయ జట్టు విధుల మీద ప్రైవేట్ లీగ్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని న్యూజిలాండ్ క్రికెట్లోని కీలక వ్యక్తి సమర్దించాడు. ఇది వారి కోచింగ్ అనుభవాన్ని పెంచుకునే గొప్ప అవకాశమని అన్నాడు. ఓరమ్, రాంచీ గైర్హాజరీలో రాబోయే సిరీస్లకు ప్రత్యామ్నాయ కోచ్లను నియమిస్తున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు జానీ బాసెట్-గ్రాహమ్, గ్రేమ్ ఆల్డ్రిడ్జ్.. బంగ్లాదేశ్ పర్యటనకు అదనంగా బ్రెండన్ డాంకర్స్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్కు డిప్యూటీలుగా పని చేస్తారని తెలిపాడు.


