అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: కోహ్లి | "I Need To Be Happy...": Virat Kohli Breaks Silence On Quitting As Team India And RCB Captaincy | Sakshi
Sakshi News home page

Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా

May 6 2025 2:16 PM | Updated on May 6 2025 3:19 PM

Virat Kohli Breaks silence on Quitting As India And RCB Captain

టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్‌ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.

ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా
ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్‌లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను.

ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్‌ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నా.. బ్యాటర్‌గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్‌పోజ్‌ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.

పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.

ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్‌ అయ్యాను. ఈ సీజన్‌లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్‌-19 క్రికెట్‌లో కెప్టెన్‌గా భారత్‌కు టైటిల్‌ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.

కెప్టెన్‌గానూ తనదైన ముద్ర
బ్యాటింగ్‌ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్‌లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.

ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.

రికార్డుల రారాజు
టెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్‌గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.

ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్‌లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు.

చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్‌’!.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement