బతుకులను మార్చిన ‘బంతి’ | Talent of Govindaraopet youth in Volleyball game | Sakshi
Sakshi News home page

బతుకులను మార్చిన ‘బంతి’

Dec 28 2024 11:11 AM | Updated on Dec 28 2024 11:23 AM

Talent of Govindaraopet youth in Volleyball game

వాలీబాల్‌ ఆటలో గోవిందరావుపేట యువకుల ప్రతిభ 

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు 

ఉన్నత స్థాయిలో కొందరు.. కూలీలుగా మరికొందరు 

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన వాలీబాల్‌ ఆట  

గోవిందరావుపేట: వాలీబాల్‌ ఆటంటే గుర్తొచ్చేది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అని చెప్పొచ్చు. అంతటి ప్రత్యేకత సంతరించుకున్న ఈ మండలం నుంచి ఎంతోమంది యువకులు వాలీబాల్‌ ఆటలో రాణించి జీవితంలో స్థిరపడ్డారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు బాగులేక, చదువులు పూర్తి కాక రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఆటలో, చదువులో రాణిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించినా గోవిందరావుపేట మండలం క్రీడాకారులు పాల్గొంటారు. ప్రథమ లేదా ద్వితీయ స్థానం దక్కించుకుని వస్తారు. అంతేకాకుండా భారత్‌ టీంలో కెపె్టన్‌గా, కోచ్‌గా, టీంలో సభ్యులుగా.. ఈ మండలం నుంచి ఎంతోమంది క్రీడాకారులు రాణించారు., రాణిస్తున్నారు. గోవిందరావుపేట మండలం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారులను అందించడం విశేషం.

చల్వాయి వాలీబాల్‌ టీం ప్రత్యేకం
రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చల్వాయి వాలీబాల్‌ టీం ప్రత్యేకమైనది. 1985లో గ్రామంలో వాలీబాల్‌ ఆట మొదలైంది. గ్రామానికి చెందిన గింజిపెల్లి నాగేశ్వరరావు, సురేశ్, భేతి రవీందర్‌ రెడ్డి, ఎండి హాకీం, గాజర్ల తిరుపతి, బండమీది రమేశ్, అప్పాల శ్రీనివాస్‌లతోపాటు పలువురికి ఆట నేర్చుకోవాలనే తపన విద్యార్థి దశలోనే కలిగింది. అప్పటి పీఈటీలు గణపతి రెడ్డి, రాములు.. జెడ్పీ హైసూ్కల్‌ ఆవరణలో వాలీబాల్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆప్పటి శిక్షణలో క్రీడాకారులకు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని పరిస్థితి. వాలీబాల్‌ క్రీడపై మక్కువ చూపుతున్న క్రీడాకారులను పీఈటీలు చూసి మురిసిపోయి మరింత ప్రోత్సాహం అందించారు. 1990లో ఖిలా వరంగల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌లో.. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచే వెంకటాపూర్, ఇనుగుర్తి టీంలను సైతం చల్వాయి టీం ఓడించింది. 

చల్వాయి టీం మొదటి స్థానం సాధించడంతో రాష్ట్రస్థాయి క్రీడాకారులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో చల్వాయి గ్రామంలో వాలీబాల్‌ ఆటపై చాలామంది యువకుల్లో ఆసక్తి పెరిగి బంతి పట్టి సాధన మొదలుపెట్టారు. గ్రామంలో ఇప్పటికే మేకల కృష్ణ ప్రభుత్వ పాఠశాలలో పీడీగా, సాయబోయిన భిక్షపతి పోలీస్‌ శాఖలో, కన్నెబోయిన సతీశ్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ కోచ్‌గా, తాటి సుమన్, మద్దెల శ్రీనులు కళాశాలలో పీఈటీలుగా ఉద్యోగాలు చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. చదువుతో పాటు, వాలీబాల్‌ క్రీడల్లో రాణించడంతో.. గ్రామానికి చెందిన సుమారు 30 మంది క్రీడా కోటాలో డిఫెన్స్, పోలీస్, ఆర్మీ, పీఈటీ, ఉపాధ్యాయులుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు.

గోవిందరావుపేట నుంచి ఎందరో క్రీడాకారులు..
గోవిందరావుపేట గ్రామంలో 1982లో వాలీబాల్‌ ఆట మొదలైంది. అప్పటి గోవిందరావుపేట హైసూ్కల్‌ పీఈటీలు రాజుకుమార్, నర్సింహం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు కోనేరు చంద్రశేఖర్, గోడవల్లి రామకృష్ణ, అన్నె శ్రీనివాస్, కొంరాజుల నరేందర్, ఆకుల యుగేందర్, గోడవల్లి జయప్రకాశ్, ముంజా రమేశ్, తుమ్మల రామకృష్ణ, సూరపనేని రవి, కొత్తపల్లి ప్రసాద్, నాగేశ్వరరావు, సాంబశివరావులు వాలీబాల్‌ ఆటల్లో రాణించేవారు. స్పోర్ట్స్‌ కోటాలో సుమారు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో 20 మంది క్రీడాకారులు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడడమే కాకుండా.. ఇండియా జట్టు కెపె్టన్‌గా పాలడుగు వెంకటేశ్వరరావు వ్యవహరించడం గర్వించదగ్గ విషయం.  

కుగ్రామంనుంచి అంతర్జాతీయ స్థాయి కోచ్‌గా..
ములుగు జిల్లాలోని చల్వాయి గ్రామం నుంచి కోసరి కృష్ణ ప్రసాద్‌ వాలీబాల్‌ ఆటలో గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి కోచ్‌గా ఎదిగారు. 1994లో వాలీబాల్‌ ఆట మొదలుపెట్టిన కృష్ణ ప్రసాద్‌ అనతి కాలంలోనే తిరుగులేని ఆటగాడిగా రుజువు చేసుకున్నారు. ఇప్పటి వరకు 33 బంగారు, రెండు రజిత పతకాలతోపాటు క్రీడా సేవ రత్న అవార్డు అందుకున్నారు. ఇతని ప్రతిభతో 2005లో డీఆర్డీవోలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం భారత మహిళ వాలీబాల్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే గ్రామంలో తనతో ఆడిస్తూ.. ఆటల్లో మెలకువలు నేర్పుతూ.. శిక్షణ ఇస్తూ.. మరింత మంది క్రీడాకారులను తయారు చేశారు. వారంతా ప్రస్తుతం ప్రతిభతో పాటు స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు సంతోషంగా ఉందని కోసరి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు.

భారత్‌ కెప్టెన్‌గా పాలడుగు వెంకటేశ్వరరావు
గోవిందరావుపేటలో జని్మంచిన పాలడుగు వెంకటేశ్వరరావు వాలీబాల్‌ క్రీడల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. భారత జట్టులో 1995 నుంచి 2001 వరకు 6 సంవత్సరాల పాటు 19 అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, 9 బంగారు, 2 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించారు. వెంకటేశ్వరరావు ప్రతిభను గుర్తించి 1996లో మూడు అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం డాజిల్‌ స్పోర్ట్స్‌ వేర్‌ కంపెనీని స్థాపించి క్రీడాకారులకు కావాల్సిన దుస్తులను తయారుచేస్తూ, క్రీడా రంగంలో ములుగు జిల్లాను దత్తత తీసుకున్నారు. క్రీడాకారులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని, టోర్నమెంట్లు నిర్వహించడానికి తన వంతు సహాయం చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement