T20 World Cup 2021 Pak Vs SCO: ఐదుకు ఐదు గెలిచి పాక్‌ టాప్‌.. అట్టడుగున స్కాట్లాండ్‌

T20 World Cup 2021: Pakistan Beat Scotland By 72 Runs Won 5 Out Of 5 - Sakshi

పాకిస్తాన్‌ అజేయంగా...

ఆఖరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 72 పరుగులతో ఘనవిజయం

షోయబ్‌ మాలిక్, ఆజమ్‌ మెరుపులు

గ్రూప్‌–2లో టాప్‌ ర్యాంక్‌

T20 World Cup 2021: Pakistan Beat Scotland By 72 Runs : టి20 ప్రపంచకప్‌ సూపర్‌–12 లీగ్‌ దశను మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ అజేయంగా ముగించింది. గ్రూప్‌–2లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 72 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన పాక్‌ 10 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. తొలుత పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (47 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీ చేశాడు.

చివర్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షోయబ్‌ మాలిక్‌ (18 బంతుల్లో 54 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) సూపర్‌ ఫినిష్‌ ఇచ్చాడు. ఛేదనలో స్కాట్లాండ్‌ 20 ఓవర్లో 6 వికెట్లకు 117 పరుగులు చేసి ఓడింది. రిచీ బెరింగ్టన్‌ (37 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కగా... షాహిన్‌ అఫ్రిది, హారిస్‌ రవూఫ్, హసన్‌ అలీ ఒక్కో వికెట్‌ తీశారు. ఈనెల 11న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పాక్‌ ఆడుతుంది. ఇక ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్‌ ఐదింటికి ఐదు మ్యాచ్‌లు ఓడి అట్టడుగున ఉంది.

నెమ్మదిగా ఆరంభం 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. రిజ్వాన్‌ (15), ఫఖర్‌ జమాన్‌ (8) విఫలమయ్యారు. దాంతో పాకిస్తాన్‌ 10 ఓవర్ల తర్వాత 60/2గా నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మొహమ్మద్‌ హఫీజ్‌ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఆజమ్‌ పాక్‌ను ఆదుకున్నాడు. వీరు మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. హఫీజ్‌ అవుటయ్యాక ఆజమ్‌ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.  

సూపర్‌ మాలిక్‌ 
షోయబ్‌ మాలిక్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పాక్‌ స్కోరు 15 ఓవర్లలో 112/3. క్రీజులోకి వచ్చిన షోయబ్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాడు. 18 బంతులు ఎదుర్కొన్న షోయబ్‌... ఒక ఫోర్‌తో పాటు ఆరు సిక్స్‌లు బాదాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచిన అతడు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. షోయబ్‌ దూకుడుతో పాక్‌ చివరి 5 ఓవర్లలో 77 పరుగులు రాబట్టింది.

చదవండి: T20 World Cup 2021: కివీస్‌ సెమీస్‌కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్‌లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు!
Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్‌ ఆత్మహత్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top