T20 World Cup: సెమీస్ చేరేది ఆ 4 జట్లే: ఆసీస్ మాజీ క్రికెటర్
Published
Thu, Oct 21 2021 11:37 AM
Brad Hogg On T20 World Cup 2021 Semi- Finalists:టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 23 నుంచి సూపర్-12 రౌండ్ మొదలు కానుంది. క్వాలిఫైయర్స్లో అర్హత సాధించిన 4 జట్లు... ఈవెంట్కు నేరుగా అర్హత సాధించిన 8 జట్ల మధ్య అసలు పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. ఆశ్చర్యకరంగా ఇందులో తమ జట్టుకు మాత్రం చోటు కల్పించలేదు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, ఇండియా, పాకిస్తాన్ ఈసారి సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయన్నాడు.
ఈ మేరకు టీమిండియా మాజీ బ్యాటర్ దీప్ దాస్గుప్తాతో చాట్ చేసిన బ్రాడ్ హాగ్... ‘‘గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్... గ్రూపు-2 నుంచి పాకిస్తాన్, ఇండియా సెమీస్కు చేరతాయి’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, అక్టోబరు 24 నాటి తమ తొలి మ్యాచ్లో గనుక పాకిస్తాన్.. టీమిండియా చేతిలో ఓడితే గనుక సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
‘‘ఒకవేళ మొదటి మ్యాచ్లో పాకిస్తాన్.. భారత్ను ఓడించనట్లయితే... న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ ప్రభావం వారిపై ఉంటుంది. సెమీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా తగ్గుతాయి’’ అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.