T20 World Cup 2022: Team India May Reach Semi-Finals Easily, Check Here - Sakshi
Sakshi News home page

T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!

Published Mon, Oct 24 2022 9:42 PM

T20 WC 2022: Team India May Reach Semi Finals Easily - Sakshi

నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (అక్టోబర్‌ 23) పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఘనంగా బోణీ కొట్టింది. మెగా టోర్నీలో భాగంగా గ్రూప్‌-2లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్‌లు (నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే) ఆడాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీలో సాధించిన ఒక్క విజయంతోనే టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అదెలా అంటే.. గ్రూప్‌-2లో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్‌పై భారత్‌, నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌, జింబాబ్వే-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ గ్రూప్‌లో పటిష్టమైన జట్లు, సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి భారత్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా అని క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్పగలుగుతారు.

అయితే, సెమీస్‌ రేసులో నిలువగలిగిన పాకిస్తాన్‌ (భారత్‌ చేతిలో ఓటమి), సౌతాఫ్రికాలకు (జింబాబ్వేతో మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగియడం) తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురు కావడంతో భారత్‌ దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

భారత్‌ తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే అని వారు భావిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఎలాగూ నెదర్లాండ్స్‌, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్లు ఉండటంతో, భారత్‌కు వాటిపై విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ భారత్‌ దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా మిగతా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా దర్జాగా సెమీస్‌కు వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అంచనాలు ఎలా ఉన్నా, చిన్న జట్లే కదా అని ఏమరపాటుగా ఉంటే మాత్రం క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు పట్టిన గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. కాగా, రెండు గ్రూప్‌ల (గ్రూప్‌-1, గ్రూప్‌-2) నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. 
చదవండి: కోహ్లి ఫ్యాన్స్‌కు కనువిందు.. రోహిత్‌ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..!
 

Advertisement
Advertisement