వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై | Surya kumar yadav making a strong statement after being removed from Indian T20 team | Sakshi
Sakshi News home page

వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై

Jun 8 2026 7:06 PM | Updated on Jun 8 2026 7:24 PM

Surya kumar yadav making a strong statement after being removed from Indian T20 team

కెప్టెన్సీతో పాటు టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌లో కసి రగులుతోన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ముంబై లీగ్‌లో అతడు వరుస విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. 

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 పరుగులు చేసిన స్కై.. తాజాగా తానాడిన రెండో మ్యాచ్‌లో (మరాఠా రాయల్స్‌) మరింతగా చెలరేగిపోయి 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలుపు తీరాలు దాటించాడు. 

ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును స్కై.. ఇదే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన సహచరుడు సిల్వెస్టర్‌ డిసౌజాతో షేర్‌ చేసుకొని తన గొప్ప మనసును చాటుకున్నాడు.

మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. సిల్వెస్టర్‌ డిసౌజా (3.5-0-21-5) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్‌ జట్టులో 36 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. చిన్మయ్‌ రాజేశ్‌ సుతార్‌ (32 రిటైర్డ్‌ ఔట్‌), సాహిల్‌ జాదవ్‌ (15), కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (24), అయాజ్‌ ఖాన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రంప్స్‌ నైట్స్‌ జట్టు.. సూర్యకుమార్‌ యాదవ్‌ అజేయ అర్ద సెంచరీతో పాటు నూతన్‌ కుమార్‌ గోయెల్‌ (56) అర్ద సెంచరీతో రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

కాగా, త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను​ తాజాగా ప్రకటించారు. ఫామ్‌ కోల్పోయిన కారణంగా భారత సెలెక్టర్లు సూర్యను జట్టును తప్పించి, కెప్టెన్సీ నుంచి తొలగించారు. సూర్య స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ భారత టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement