సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 57 నిమిషాల్లో 16–21, 21–17, 13–21తో భారత్కే చెందిన మూడో సీడ్ తన్వీ శర్మ చేతిలో పోరాడి ఓడింది. భారత్కే చెందిన అష్మిత చాలిహా, రక్షిత శ్రీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అష్మిత 21–17, 21–6తో కిమ్ జిన్ మి (దక్షిణ కొరియా)పై, రక్షిత శ్రీ 22–20, 21–10తో మనామి సుయిజు (జపాన్)పై గెలిచారు.
భారత ఇతర ప్లేయర్లు ఇషారాణి బారువా 21–17, 18–21, 19–21తో కిమ్ మిన్ సున్ (దక్షిణ కొరియా) చేతిలో, మాన్సి సింగ్ 12–21, 21–14, 17–21తో హాన్ కియాన్ జి (చైనా) చేతిలో, అన్మోల్ ఖరబ్ 21–23, 21–15, 18–21తో థి ట్రాంగ్ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ (భారత్) జోడీ 21–18, 21–19తో కిమ్ యంగ్ హైక్–షిన్ తె యాంగ్ (దక్షిణ కొరియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.


