న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రస్తుతం 554 మంది కోచ్ల స్థానాలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. రాజ్యసభలో గురువారం క్రీడలకు సంబంధించి వచ్చిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానిమిచ్చారు. జనవరిలో 350 మంది అసిస్టెంట్ కోచ్లను ఎంపిక చేసినా... దేశంలోని వివిధ ‘సాయ్’ కేంద్రాల్లో ప్రస్తుతం ఓవరాల్గా 554 స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో 90 ఖాళీలు హెడ్ కోచ్లకు సంబంధించినవే కావడం గమనార్హం.
డోపింగ్కు పాల్పడిన ఆటగాళ్లకు శిక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని కూడా మంత్రి అన్నారు. ఈ క్రమంలో శాంపుల్ కలెక్షన్ పర్సనల్ (ఎస్సీపీ)ల సంఖ్యను బాగా పెంచామని, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లోనూ డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాని మాండవియా స్పష్టం చేశారు. దేశంలో ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం తమ సహకారం అందిస్తోందన్న మంత్రి... గత ఐదేళ్లలో ఇందు కోసం రూ.37.98 కోట్లు అందించినట్లు గుర్తు చేశారు. 2036 ఒలింపిక్స్ భారత్కు కేటాయించే విధంగా తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


