భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆదివారం నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానం వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గెలిచి మంచి జోష్లో ఉన్న భారత్.. అదే జోరును కొలంబోలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గాలే టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన శ్రీలంక తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో భారత్ను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సిల్వా తెలిపాడు.
"బ్యాటింగ్లో భారీ స్కోర్ సాధించి, అనంతరం ప్రత్యర్ధి వికెట్ల తీయడమే మా ప్రధాన వ్యూహం. గాలే టెస్టులో భారత్ కూడా ఇదే చేసింది. తొలి రెండు రోజులూ బ్యాటింగ్ చేసి టీమిండియా 460 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో మేము కూబా బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి, ప్రత్యర్థి జట్టు 20 వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం.
తొలి మ్యాచ్లో ఓడిపోవడం నిరాశపరిచినా.. కొలంబోలో మాత్రం తొలి రోజు నుంచే పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేనప్పటికి, యంగ్ టాలెంట్ రూపంలో మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.
ఈ మ్యాచ్ ద్వారా కామిల్ మిషార టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. గతకొంత కాలంగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విష్వ ఫెర్నాండోను జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నామని" డిసిల్వా పేర్కొన్నాడు.


