నందిని ‘పసిడి’ జంప్‌ | Social Welfare Residential Student Nandini Wins Gold Medal | Sakshi
Sakshi News home page

నందిని ‘పసిడి’ జంప్‌

Feb 7 2021 6:23 AM | Updated on Feb 7 2021 6:23 AM

Social Welfare Residential Student Nandini Wins Gold Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు తెలంగాణకు రెండు పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక పతకం లభించాయి. గువాహటిలో శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్‌–18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... అండర్‌–20 బాలుర షాట్‌పుట్‌ ఈవెంట్‌లో మొహమ్మద్‌ మోసిన్‌ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. అండర్‌–18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీ 5.38 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది.
 
నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్‌ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ‘ద్రోణాచార్య అవార్డు గ్రహీత’ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న నందిని గత ఏడాది ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ‘జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనే ప్రతీ టోర్నీలో విజయం సాధించేందుకు, పతకాలు గెలిచేందుకు వందశాతం కృషి చేస్తాను. రాష్ట్రంతోపాటు దేశానికి పేరు తెచ్చేలా శ్రమిస్తాను. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే నా సుదీర్ఘ లక్ష్యం’ అని నందిని వ్యాఖ్యానించింది. షాట్‌పుట్‌ ఫైనల్లో మోసిన్‌ ఖురేషీ ఇనుప గుండును 16.36 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement