source: BCCI X
టీమిండియా స్పిన్ బౌలర్ శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో 804 రేటింగ్ పాయింట్లు సాధించిన ఆమె.. 800 పాయింట్ల మార్క్ను తాకిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పింది.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో శ్రీ చరణితో పాటు మరో ఇద్దరు మాత్రమే 800 రేటింగ్ పాయింట్ల మార్క్ను తాకారు. వీరిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగన్ షట్ (806) అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ (802) శ్రీ చరణి తర్వాతి స్థానంలో ఉంది.
అగ్రస్థానంలోనే చరణి
తాజా ర్యాంకింగ్స్లో చరణి తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. తాజాగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో చరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో టోర్నీలో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 12కు చేరింది. ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఆసియా కప్ను సొంతం చేసుకోవడంలో చరణి కీలక పాత్ర పోషించింది.
రెండో స్థానానికి ఎగబాకిన దీప్తి శర్మ
ఆసియా కప్లో అద్భుత ప్రదర్శనలు చేసిన దీప్తి శర్మకు కూడా తాజా ర్యాంకింగ్స్లో మంచి ఫలితం దక్కింది. టోర్నీ మొత్తంలో 14 వికెట్లు తీసిన దీప్తి.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో దీప్తి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి భారత విజయానికి తోడ్పడింది.
బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్లో అదరగొట్టిన భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి ఎగబాకింది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ షఫాలీ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకుంది.
మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసీస్కు చెందిన బెత్ మూనీ, జార్జియా వాల్ టాప్-2లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో విండీస్కు చెందిన హేలీ మాథ్యూస్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. భారత స్టార్ దీప్తి శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఇదీ చదవండి: కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్


