ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్‌..వన్డేల్లో అరుదైన రికార్డు..!

Rishabh Pant Becomes Third Indian Wicketkeeper to Hit an ODI Century Outside Asia - Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సెంచరీతో చెలరేగాడు. తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీను పంత్‌ నమోదు చేశాడు. భారత్‌కు ఓటమి ఖాయం అనుకున్న వేళ పంత్‌ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 72 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో పంత్‌.. హార్దిక్‌ పాండ్యాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. హార్దిక్‌ ఔటయ్యాక ధాటిగా ఆడిన పంత్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లలో రిషభ్‌ పంత్‌ (113 బంతుల్లో 125 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు),  హార్దిక్‌ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) పరుగులతో రాణించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్‌ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (31 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా నాలగు వికెట్లతో అదరగొట్టగా.. .. చహల్‌ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు తీశారు.


పంత్‌ అరుదైన రికార్డు
ఇక తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా వెలుపల సెంచరీ సాధించిన మూడో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు. అంతకుమందు రాహుల్ ద్రవిడ్ (145), కేఎల్‌ రాహుల్‌(112) ఈ అరుదైన రికార్డు సాధించారు. అదే విధంగా వన్డేలలో సెంచరీ సాధించిన నాలుగో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మూడో వన్డే
వేదిక: మాంచెస్టర్‌
టాస్‌: ఇండియా- బౌలింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు: 259 (45.5)
ఇండియా స్కోరు: 261/5 (42.1)
విజేత: భారత్‌.. 5 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రిషబ్‌ పంత్‌(125 పరుగులు- నాటౌట్‌)
చదవండి: ENG vs IND: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి భారత ఆటగాడిగా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top