Rishabh Pant Appointed As Uttarakhand State Brand Ambassador, Details Inside - Sakshi
Sakshi News home page

Rishabh Pant: రిషభ్‌ పంత్‌కు గొప్ప అవకాశం... ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా!

Aug 11 2022 6:47 PM | Updated on Aug 11 2022 7:04 PM

Rishabh Pant Appointed As Uttarakhand State Brand Ambassador Thanks CM - Sakshi

ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రిషభ్‌ పంత్‌(PC: Rishabh Pant)

దేవభూమి సుపుత్రుడు అంటూ పంత్‌ను ఆకాశానికెత్తిన సీఎం

టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు గొప్ప గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘దేవభూమి సుపుత్రుడు, ప్రతిభావంతుడైన రిషభ్‌ పంత్‌ను ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌ యువతను క్రీడలు, ప్రజారోగ్యం విషయంలో ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రిషభ్‌ పంత్‌కు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి శుభాభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో దిగిన ఫొటోలను పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశాడు. తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామికి ధన్యవాదాలు తెలిపాడు.

‘‘గొప్పగా అనిపిస్తోంది.. అతి పెద్ద బాధ్యత. యువ స్నేహితులారా.. మీపై మీకు నమ్మకముంటే అనుకున్న లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఆ దిశగా అడుగులు వేస్తూ మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుని కఠిన శ్రమకు ఓర్చుకుంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదు’’ అంటూ 24 ఏళ్ల పంత్‌ ఉత్తరాఖండ్‌ యువతకు పిలుపునిచ్చాడు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. నీకు దిష్టి తగలకూడదు అన్నట్లుగా ఎమోజీతో బదులిచ్చాడు.

అంచెలంచెలుగా ఎదిగి..
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో 1997, అక్టోబరు 4న జన్మించిన రిషభ్‌ పంత్‌ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన విషయం తెలిసిందే. ఆరంభంలో.. మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని వారసుడిగా ప్రశంసలు అందుకున్న ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, కఠిన శ్రమ, అంకిత భావంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పంత్‌.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

విదేశీ గడ్డ మీద అనేక పర్యాయాలు టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి ప్రతిభను నిరూపించుకున్నాడు. అంతేకాదు ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికై ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. 2-2తో సిరీస్‌ సమం చేసి సారథిగానూ సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం... రానున్న ఆసియా కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022 ఈవెంట్లకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు పంత్‌.

చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement