Reports: 3 Players PBKS Might Release Ahead of Next Season - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్‌ కింగ్స్‌ ..!

Jun 5 2022 5:17 PM | Updated on Jun 5 2022 6:42 PM

Reports: 3 Players PBKS might release ahead of next season - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌ ప్రయాణం లీగ్‌ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్‌ అగర్వాల్‌ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన పంజాబ్‌.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది సీజన్‌లో నిరాశ పరిచిన ఆటగాళ్లను ఐపీఎల్‌-2023కు ముందు  పంజాబ్‌ కింగ్స్‌ విడుదల చేసే అవకాశం ఉంది.
ఓడియన్ స్మిత్
వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను మెగా వేలంలో రూ.6 కోట్ల భారీ ధరకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. అయితే స్మిత్ పంజాబ్‌ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే పంజాబ్‌ అంచనాలను అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అతడు తన పేలవ ప్రదర్శనతో తుది జట్టులో తన చోటును కోల్పోయాడు.

ఈ ఏడాది సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లతో పాటు,51 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో 11.87 ఏకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు అతడి స్థానంలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని పంజాబ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సందీప్‌ శర్మ
ఐపీఎల్‌లో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను మెగా వేలంలో రూ.50లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అయితే ఈ సీజన్‌లో సందీప్‌ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సందీప్‌ శర్మకు పంజాబ్ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

గత రెండు సీజన్‌ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే పంజాబ్‌ జట్టులో కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫ్రంట్‌ లైన్‌ పేసర్లుగా ఉన్నారు. మరో వైపు ఆల్‌రౌండర్‌  రిషి ధావన్‌ను మూడవ పేసర్‌గా పంజాబ్‌ ఉపయోగించుకుంటుంది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సందీప్‌ శర్మను పంజాబ్‌ విడిచి పెట్టే అవకాశం ఉంది.

ప్రభ్‌సిమ్రాన్  సింగ్
ఐపీఎల్‌- 2022 మెగా వేలంలో మరోసారి యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. జానీ బెయిర్‌ స్టో, జితేష్ శర్మ రూపంలో ఇద్దరు వికెట్‌ కీపర్లు ఉండటంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు దూరం కావడంతో ప్రభ్‌సిమ్రాన్‌కు ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ఇప్పటికే ఇద్దరు వికెట్‌ కీపర్‌లు ఉండటంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ప్రభ్‌సిమ్రాన్‌ను పంజాబ్‌ విడిచి పెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.
చదవండి: IPL 2022: 'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది'

Advertisement
 
Advertisement
Advertisement