ఆకట్టుకున్న పడిక్కల్‌..ముంబై టార్గెట్‌ 165 | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న పడిక్కల్‌..ముంబై టార్గెట్‌ 165

Published Wed, Oct 28 2020 9:13 PM

RCB Set 165 Runs Target For Mumbai Indians  - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ ముంబై ఇండియన్స్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచిన ముంబై ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆర్‌సీబీ ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌, జోష్‌ పిలిప్‌లు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇద్దరు బ్యాట్‌ ఝులిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 6ఓవర్లో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగులకు చేరగానే జోష్‌ పిలిప్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వేగంగా ఇన్నింగ్స్‌ ఆడిన దేవదూత్‌ పడిక్కల్‌ కొన్ని చక్కని షాట్లు ఆడి  30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, కెప్టెన్‌ కోహ్లి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.

ఏబీ డివిలియర్స్‌ వచ్చీ రాగానే ఫోర్, సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించినా జట్టు స్కోరు  పొలార్డ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఒకపక్క వికెట్లు పడుతున్నా దేవదూత్‌ వేగంగా ఆడడంతో ఏ దశలోనూ రన్‌రేట్‌ 8కి తక్కువగా నమోదు కాలేదు. దీంతో ఆర్‌సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆర్‌సీబీకి పరుగులు రావడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శివమ్‌ మావితో పాటు 45 బంతుల్లో 74 పరుగులు చేసిన పడిక్కల్‌ ఒకే ఓవర్లో వెనుదిరిగారు. తర్వాత వచ్చిన క్రిస్‌ మోరిస్‌ విఫలం కావడం.. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 10 పరుగులు, గురుకీరత్‌ 14 పరుగుల చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా, బౌల్ట్‌ , పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

Advertisement
Advertisement