దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్‌

Ravindra Jadeja Ranks 2nd Position Allround Rankings Announced By ICC  - Sakshi

దుబాయ్‌: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో బొటనవేలి గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు దిగలేదు. కాగా జడేజా బొటనవేలికి శస్త్ర చికిత్స పూర్తయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా జడేజా ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టుతో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. (చదవండి: సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్‌ వార్నర్‌!)

పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దుమ్మురేపిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమిస్‌ 5 స్థానాలు ఎగబాకి టాప్‌ 5లో చోటు సంపాదించాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కివీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. స్మిత్‌ 900 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కాగా టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలవగా.. భారత తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానే ఒక స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా బౌలర్లు అశ్విన్‌, బుమ్రాలు 9, 10వ స్థానాల్లో నిలిచారు. (చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా')

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top