చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి | Ranji Trophy 2026: Jammu Kashmir Beat Karnataka Clinch Maiden Title | Sakshi
Sakshi News home page

చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి

Feb 28 2026 2:25 PM | Updated on Feb 28 2026 3:24 PM

Ranji Trophy 2026: Jammu Kashmir Beat Karnataka Clinch Maiden Title

జమ్మూ కశ్మీర్‌ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

అసాధారణ విజయాలతో
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో జమ్మూ కశ్మీర్‌ అసాధారణ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్‌ రేసులో నిలిచింది.

ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్‌ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్‌ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగులు సాధించింది.

సమిష్టిగా రాణించిన బ్యాటర్లు
యావర్‌ హసన్‌ (88), కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), కన్హయ్య వాధవాన్‌ (70), సాహిల్‌ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్‌ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.

చెలరేగిన ఆకిబ్‌ నబీ
స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (13) విఫలం కాగా.. మరో సీనియర్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్కాల్‌ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్‌ గోపాల్‌ (27), కృతిక్‌ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

అజేయ సెంచరీల సాక్షిగా 
ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్‌.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్‌ కమ్రాన్‌ అక్మల్‌ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్‌ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలిచాడు.

సాహిల్‌ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్‌ కెప్టెన్‌ పారస్‌ డోగ్రా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.

సీఎం అభినందనలు
పారస్‌ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్‌, సాహిల్‌ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్‌కు అందించాడు.  కాగా సాహిల్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. 

చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?

 

ఇక జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్‌ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ సైతం ఈ చారిత్రాత్మక​ ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్‌తో పాటు కశ్మీర్‌ జట్టును అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement