భారత చెస్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్కు చెందిన గ్రాండ్మాస్టర్ అలువా నూర్మన్తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్కు చేరుకుంది.
ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.
చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం!


