తైజుయింగ్‌ మనసు గెలుచుకున్న పీవీ సింధు | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: తైజుయింగ్‌ మనసు గెలుచుకున్న పీవీ సింధు

Published Mon, Aug 2 2021 12:01 PM

PV Sindhu Sincere Encouragement Made Me Cry Says Tai Tzu Ying - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించి యావత్‌ భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్న తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్లో తనను ఒడించిన చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ మనసు కూడా గెల్చుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌ ఓటమి తరువాత  సింధు నిజాయితీగా అందించిన మద్దతుతో తనకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తైజూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌  పెట్టింది.

బంగారు పతకాన్ని కోల్పోవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒలింపిక్స్‌ కలల వేదికపై మూడోసారి అడుగుపెట్టి.. చివరకు ఫైనల్‌కు చేరుకున్నాను, కానీ ఫైనల్‌లో విజయం సాధించలేకపోయాను. లోపాలు ఎప్పుడూ ఉంటాయి, అయినా మెరుగైన ఫలితాన్ని సాధించడం ఉత్సాహాన్నిచ్చింది. తైజూయింగ్‌ యూ ఆర్‌ గ్రేట్‌ అంటూ తనను తాను అభినందించుకోవడం విశేషం ఈ సందర్భంగా తనకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే  ఒక చిన్న విషయాన్ని  చెప్పాలంటూ సింధుపట్ల తన గౌరవాన్ని చాటుకుంది.

మ్యాచ్ తర్వాత సింధు పరుగెత్తుకువచ్చి ఆలింగనం చేసుకుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా, టప్‌ ఫైట్‌ ఇచ్చారు. కానీ ఈ రోజు మీది కాదంటూ అనునయంగా చెప్పి తను ఏడిపించేసిందంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు. కాగా రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా వీసీ సింధు రికార్డు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ లో తైజుయింగ్‌ చేతిలో ఓటమి పాలైనప్పటికీ,  కాంస్య పతకం మ్యాచ్‌లో హీ బింగ్ జియావోను ఓడించింది. దీంతో  వీవీ సింధుపై ప్రశంసల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా  ప్రపంచ నంబర్ వన్‌  షట్లర్‌కు ఒలింపిక్స్‌ ఫైనల్‌లో నిరాశ ఎదురైంది. గట్టిగా పోరాడినప్పటికీ  చైనాకు చెందిన చెన్ యు ఫే (18-21, 21-19, 18-21 తేడాతో) చేతిలో ఓటమి పాలై  తైజుయింగ్‌ గోల్డ్‌ మెడల్‌  చేజార్చుకుంది. ఒలింపిక్‌  గోల్డ్‌ మెడల్ లక్ష్యంగా  పోరాడి చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement