
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. గతేడాది పద్నాలుగింట కేవలం ఐదే గెలిచిన ఈ జట్టు.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సీజన్ను ముగించింది. అయితే, ఈసారి ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఏకంగా ఐదు గెలిచింది.
ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో శనివారం నాటి మ్యాచ్లోనూ 201 పరుగుల మేర భారీ స్కోరు చేసిన పంజాబ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో 11 పాయింట్లతో పంజాబ్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.
సానుకూల ఫలితాలు
కొత్త కోచ్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting), నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో పంజాబ్ ఈ మేరకు సానుకూల ఫలితాలు సాధిస్తోంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న అపవాదును చెరిపి వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి మాత్రం భిన్నంగా స్పందించాడు.
ఈసారి కూడా పంజాబ్ ట్రోఫీ గెలవదు
కేకేఆర్తో మ్యాచ్లో రిక్కీ పాంటింగ్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత.. ఈసారి కూడా పంజాబ్ ట్రోఫీ గెలవలేదంటూ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ సీజన్లో కూడా పంజాబ్ టైటిల్ సాధించలేదని నాకు గట్టి నమ్మకం.
ఎందుకంటే.. కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చూసినప్పుడు నాకో విషయం అర్థమైంది. ఫామ్లో ఉన్న భారత బ్యాటర్లు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లను కాకుండా ఆ జట్టు కోచ్ విదేశీ ఆటగాళ్లను బ్యాటింగ్కు పంపించాడు.
పాంటింగ్ వాళ్లను నమ్మడు
భారత బ్యాటర్ల కంటే వారిపైనే ఎక్కువ నమ్మకం ఉంచాడు. కానీ వాళ్లు ఏమీ చేయలేకపోయారు. దీనిని బట్టి భారత ఆటగాళ్లపై కోచ్కు నమ్మకం లేదనిపిస్తోంది. అందుకే వాళ్లను లోయర్ ఆర్డర్లో పంపించాడు.
అతడు ఇలాగే చేశాడంటే టాప్-2లోకి వచ్చినా వాళ్లు టైటిల్ మాత్రం గెలవలేరు’’ అని మనోజ్ తివారి ఎక్స్ వేదికగా రిక్కీ పాంటింగ్ తీరును విమర్శించాడు. అయితే, మనోజ్ తీరుపై పంజాబ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘వ్యూహంలో భాగంగా.. ఒత్తిడి లేని సమయంలో ఫామ్లో లేని ఆటగాళ్లను పరీక్షిస్తే వచ్చిన నష్టమేమిటి? వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేయడంలో తప్పేముంది?’’ అని మనోజ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా కేకేఆర్తో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
మెరుపు ఇన్నింగ్స్
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69), ప్రభ్సిమ్రన్ సింగ్(49 బంతుల్లో 83) మెరుపు ఇన్నింగ్స్తో దుమ్ములేపారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో వచ్చి 25 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక నాలుగో స్థానంలో వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ (7) మరోసారి నిరాశపరచగా.. ఈసారి మార్కో యాన్సెన్ (3) కూడా విఫలమయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (6 బంతుల్లో 11) అయ్యర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక ఓవర్లో ఏడు పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది.
చదవండి: అదరగొడుతున్నాడు.. అతడిని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోండి: పీటర్సన్