నన్ను గేలి చేశారు.. అవమానించారు.. కెప్టెన్‌ వల్లే ఇలా! | Public Booed Me: Hardik Pandya Opens Up To PM Modi On His Treatment By Fans | Sakshi
Sakshi News home page

నన్ను గేలి చేశారు.. అవమానించారు: ప్రధాని మోదీతో హార్దిక్‌ పాండ్యా

Jul 6 2024 6:17 PM | Updated on Jul 6 2024 6:36 PM

Public Booed Me: Hardik Pandya Opens Up To PM Modi On His Treatment By Fans


‘‘గత ఆరు నెలల కాలం భావోద్వేగేలా సమ్మేళనం. ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ప్రేక్షకులు నన్ను ఏడిపించారు. నన్ను తమవాడిగా అనుకోలేకపోయారు.

ఎన్నో జరిగాయి. వాటన్నింటికీ ఆటతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నాను. కఠినంగా శ్రమిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని.. గట్టిగా నమ్మాను.

విమర్శలపాలైనపుడు మౌనాన్నే ఆశ్రయించాను. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆటను వదిలేది అని నిర్ణయించుకున్నాను.

గెలిచినా.. ఓడినా.. మనమేంటో మైదానంలోనే నిరూపించాలి. కెప్టెన్‌, కోచ్‌, సహచర ఆటగాళ్ల మద్దతు లభించింది. పూర్తిస్థాయిలో టోర్నీ కోసం సన్నద్ధమయ్యాను.

అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ వేసే అవకాశం రావడం.. అంచనాలు అందుకుని జట్టు విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చింది.

నిజానికి సూర్య సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అతడు క్యాచ్‌ పట్టిన తర్వాత అందరూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నా.. నేను మాత్రం సూర్య దానిని ధ్రువీకరించిన తర్వాతే సంబరాలు చేసుకున్నా.

మ్యాచ్‌లో గేమ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌ అదే’’ అంటూ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషిస్తున్న సమయంలో గత ఆర్నెళ్లుగా తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలనుకున్నానని.. టీ20 ప్రపంచకప్‌-2024 సందర్భంగా తనకు ఆ అవకాశం వచ్చిందని హార్దిక్‌ హర్షం వ్యక్తం చేశాడు.‍ కాగా ఐపీఎల్‌-2024లో రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్యాకు కాలం కలిసి రాలేదు.

రోహిత్‌ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని దారుణంగా అవమానించారు. మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హేళన చేశారు. కెరీర్‌ పరంగా ఇలా ఉంటే.. వ్యక్తిగతంగానూ భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుత ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక జగజ్జేతగా అవతరించిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీని కలిసింది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement